”శోధిని”

Sunday, 2 September 2012

పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.  అధికార పక్షం మొండిగా వ్యవహరించడం,  ప్రధాన ప్రతిపక్షం దానికి ధీటుగా సభను సాగనీయకుండా చేయడంలోనే పార్లమెంట్  సమావేశాల సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన పార్లమెంట్ ని  కొందరు నేతలు పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది.  ప్రజాస్వామ్య వాదులకు ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ లోపించడం ప్రజల దురదృష్టకరం.  వీరికి వీరి మిత్ర పక్షాలుత్తాసు  పలకడం శోచనీయం. దీంతో ఎనిమిది  రోజుల పాటు ప్రజాసమస్యలను చర్చించకుండా, కాగ్ బొగ్గు నివేదిక పైనే పార్లమెంట్ ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం. సభను జరగకుండా చేయడంలో అధికార పక్షం, ప్రధాన ప్రతి పక్షం రెండూ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.  
 

Sunday, 19 August 2012

'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!



'రంజాన్' పేరు వినగానే మనసు, తనువూ తన్మయత్వంతో పులకించి పోతుంది.  హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది.  ఇస్లామీయ క్యాలండర్, చంద్ర మాస లెక్కల ప్రకారం సంవత్సరం లోని పన్నెండు మాసాల్లో 'రంజాన్' నెల తొమ్మిదవది.  ఈ మాసం ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది,  'రంజాన్'  మహాపున్య మాసమని, మహోన్నత మైనదని ముస్లిం సోదరుల సంపూర్ణ విశ్వాసం.అందుకే ఈ రంజాన్ మాసానికి ఇంతటి గౌరవం, పవిత్రత ప్రప్తమయ్యాయి.  
   'రంజాన్' పండుగ శుభ సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

Saturday, 18 August 2012

తస్మాత్ జాగ్రత్త!



       ఆదివారం వచ్చిందంటే చాలు బయటకెళ్ళి భోంచేయడం చాలా మందికి అలవాటు.  హొటల్ పదార్థాలంటే లొట్ట లేసుకుని తినేస్తాము.  వాటి వాసనకే మైమరచి పోతాము.  కానీ, అవి తయారు చేసే వంట గదిని చూస్తే మాత్రం మరోసారి హొటల్ లోకి అడుగుపెట్టే సాహసం చేయం.  అంతటి దుర్భరమైన  స్థితి కనిపిస్తుంది అక్కడ.ఎంతో విశాలంగా అన్నీ హంగులతో కనిపించే డైనింగ్ హాల్ ఎంత అందంగా కనిపిస్తుందో, ఇరుకైన వంట గదిలో తిని పడేసిన ప్లేట్లు, గ్లాసులపై ఈగలు, బొద్దింకలు నిత్యం దర్శన మిస్తుంటాయి.  ఇక ఎలుకలు, పిల్లులు సరేసరి తయారయిన ఆహారపదార్థాలను ముందుగా అవి రుచి చూస్తుంటాయి.  మరోపక్క కుళ్ళిపోయిన కూరగాయలు వాసనలు గుభాలిస్తుంటాయి.  అంతటి అపరిశుభ్రమైన వాతావరణంలో మనం దర్శించే హొటల్ వంట గదులు ఉంటాయి. 

          వాస్తవానికి ఫుడ్ ఇన్సపెక్టర్స్ క్రమం తప్పకుండా హొటల్స్ ని  తనిఖీ చేయాల్సి ఉంటుంది.  కానీ, హొటల్ యజమానులు ఇచ్చే కాసులకు ఆశపడి అటువైపు వెళ్ళడం మానేశారు. ఫలితంగా కొన్ని హొటల్ యజమానులు నాసిరకం నూనె(కొన్ని రకాల జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె), కుళ్ళిపోయిన కూరగాయలు (కూరగాయల షాప్ వాళ్ళు కుళ్ళిపోయిన కూరగాయలను వీళ్ళ కోసమే భద్రంగాదాచి ఉంచుతారు), రోజుల నిల్వ చేసిన పదార్థాలతో టిఫన్లను. భోజనాలను తయారు చేస్తున్నారు.  అలాంటి విషాన్ని చిమ్మే ఆహారాన్ని భుజించి, ఉచితంగా అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం
.
          హొటల్ కి వెళ్తున్నారా ... తస్మాత్ జాగ్రత్త!  

Tuesday, 14 August 2012

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !



స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. అహింసాయుత మార్గంలో జాతిపిత బాపూజీ మన దేశానికి స్వేచ్చను అందించారు.  జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో  జరుపుకునే స్వాతంత్ర్య  దినోత్సవం... ఎందరో వీరుల త్యాగఫలం.  ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని  ఒక అపురూపమైన రోజు.  తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడిన రోజు. మన దేశానికి విముక్తి లభించిన రోజు.స్వాతంత్ర్యం  సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం.  అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !



Wednesday, 8 August 2012

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



బ్లాగ్ మిత్రులందరికీ ....శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


Saturday, 4 August 2012

స్నేహబంధం... ఎంత మధురం!


మచ్చలేని స్నేహం అతిమధురంగా ఉంటుంది....
ప్రాణానికి ప్రాణమైన స్నేహం జీవితాంతం తోడుగా ఉంటుంది....
ఎలాంటి స్వార్థం లేని స్నేహబంధం జీవితాన్ని సుఖమయం చేస్తుంది!

Tuesday, 31 July 2012

యమదూతలు




      ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అంటే మృత్యుశకటాలలో యమపురికి ప్రయాణం చేయడమే.  గత కొంత కాలంగా బస్సు ప్రమాదాలు చూస్తుంటే నిజమేనని పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయానించాలంటే అరచేతిలోప్రాణాలు పెట్టుకోవాల్సినదేనని ప్రస్ఫుటం చేస్తున్నాయి."ఆర్టీసీబస్సుల్లోప్రయాణించడంక్షేమకరం..సురక్షతప్రయాణంకోసంఆర్టీసీలోప్రయానించండి'  అంటూ ఢంకా బజాయించే ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను  కట్టడం చేయడంలోపూర్తిగావిఫలమవుతోంది. నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం, బస్సును స్టేజీలలో ఆపక పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలుజరుగుతున్నాయి.  డ్రైవర్స్ దూకుడికి కొందరు  ప్రాణాలు పోగొట్టుకుంటే , మరికొందరు వికలాంగులుగా మారుతున్నారు. కొందరు డ్రైవర్స్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లెక్కచేయరు.  ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో బస్సును వదిలేసి పారిపోయి  యూనియన్లను ఆశ్రయించడం జరుగుతోంది. వెనుక ఆర్టీసీ బస్సు వస్తుందంటే ద్విచక్రవాహనదారులగుండెల్లోగుబులు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఇలా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు డ్రైవర్స్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. బస్సు  కదిలే సమయంలోనే  కొందరు డ్రైవర్స్  కావాలనే వేగం  పెంచడంతో చాలా మంది ప్రయాణికులు వెనుక చక్రాల కింద పడి మరణిస్తున్నారు. వీరిని ఆ యముడే భూలోకానికి 'యమదూతలు 'గా  పంపించినట్టుంది. ఇన్నిప్రమాదాలు జరుగుతున్నా  డ్రైవర్స్ లో కొంచమైన కరుణ, జాలి కనిపించదు . పైగా వాళ్ళ  ఇష్ట ప్రకారం బస్సును డ్రైవింగ్ చేస్తుంటారు . ఇలా ప్రమాదాలు జరుగుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.