”శోధిని”

Sunday 30 September 2012

విరిసిన పువ్వులు



   మన కళ్ళ ఎదుట రకరకాల రంగుల పూలు కనిపించినా... వాటి వాసనలు తగులుతున్నా...మానసిక ప్రశాంతత వస్తుంది.  సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.  అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేఈశక్తి పుష్పాలకుంది.  పని చేయడంలో ఉత్సాహాన్ని ఇస్తాయి.  సంపెంగ, బసంతి, చమేలీ, మాధవీలత, మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, మొగలి, రంగురంగుల మందారాలు, గులాబీలు ఒళ్ళు విరుచుకుంటూ, రేకులన్నీ విప్పార్చుకుంటూ  సుగంధాన్ని వెదజల్లే మకరందాలే! మనసును మధురోహల్లో ముంచెత్తే సుమమనోహర సౌగంధాలే!!  ఈ పూల మొక్కలను  మన పెరట్లో పెంచుకోవచ్చు.  అపార్ట్ మెంట్లో అయితే కుండీలలో పెంచుకుని ఇంటిని పూలవనంగా మార్చుకోవచ్చు. కుసుమాలలో ఉన్న పరిమళం మనసుని ఆహ్లాదపరుస్తాయి.  వీటి సౌందర్యం మనకు స్వాగతం పలుకుతాయి.


Tuesday 18 September 2012

వినాయక చవితి శుభాకాంక్షలు!


జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. మన దేశంలో మొదట పూజించేది,స్మరించేది గణపతినే.  దేవతాగణంలో అగ్రపుజ ఆయనకే.  అందుకే ఆయనను 'ఆదిదేవుడు' అంటారు.  ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తే, ఆపదలు తొలగుతాయని తలపెట్టిన పనిలో విజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం.  హిందూ సంప్రదాయాలలో అన్ని ప్రాంతాలలో, అన్ని ఆచారాలలో వినాయకుని పూజకు అత్యంత ప్రాముఖ్యత వుంది.  వినాయక చవితికి ఒక ప్రత్యకత ఉంది.  కుల మత, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం.

 వినా వితి ' శుభ సందర్భంగా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక  శుభాకాంక్షలు!

   

Sunday 16 September 2012

మట్టి విగ్రహాలను ప్రతిష్టించండి ...పర్యావరణాన్ని కాపాడండి!



వినాయకుడిని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత  విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమర్జన చేయడం ఆనవాయితీ.  అయితే ఈ విగ్రహాలను తయారు చేయడంలో రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించడం వల్ల జలాశయాలు కలుషిత మవుతున్నాయి. దాంతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది.  అందుకే పర్యావరణ పరిరక్షణ కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇందులో భాగంగా మనం ఇంట్లో, కాలనీలలో,  ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాద్యమైనంత వరకు చిన్నవిగా ఉండేటట్లు చూడాలి.  మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే  చూడ ముచ్చటగా ఉంటాయి.  విగ్రహాలను నిమర్జన చేసినప్పుడు నీటిలో పూర్తిగా మునిగి పోవాలి.  అప్పుడే నిమర్జనకు అర్థం పరమార్థం.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించండి .  ఇది ప్రజలందరికి సంబంధించిన అంశం.  జలాశయాలు కలుషితం కాకుండా  చూడాల్సిన భాద్యత  మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ చిన్న మట్టి విగ్రహాలను  ప్రతిష్టించి పూజించండి ...పర్యావరణాన్ని కాపాడండి.

Wednesday 12 September 2012

విద్యుత్ ను పొదుపు చేద్దాం!


ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే, రెండు యూనిట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేసినంత ప్రయోజనం.  ఇంట్లో ధారాళంగా వెలుతురు ప్రసరించేలా ఏర్పాటు చేసుకుంటే, పట్టపగలు లైట్లు వేసుకోవాల్సిన దుస్థితి రాదు.చలికాలం ఫ్యాన్లు తిరగాల్సిన అవసరం  ఏర్పడదు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తే ఏసీలు వాడాల్సిన పని ఉండదు రోజువారీ వినియోగంలో కాస్త పొదుపు పాటిస్తే బిల్లుల మోత తగ్గించుకోవచ్చు. విద్యుత్ ను పొదుపు చేయడంలో కొన్ని...
మెళకువలు.
ట్యూబ్ లైటు ఫ్లోరోసెంట్, సిఎఫ్ఎల్  బల్బుల్ వాడితే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
సామర్థ్యానికి మించి వాషింగ్ మిషన్లలో దుస్తులు వేయరాదు. 
బోరింగ్ మోటార్ల వద్ద కెపాసిటర్లను అమర్చుకుంటే తక్కువ కరెంట్ ఖర్చు అవుతెంది.
తక్కువ బరువుండే ఐరన్ బాక్స్ లను  వాడాలి.
ఫ్రిజ్  తలుపును ఎక్కువ సేపు తెరచి ఉంచరాదు.  ఫ్రిజ్ లో ఐస్ ముక్కలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
మరికొన్ని ముఖ్య విషయాలు
ఒక ట్యూబ్ లైటు 29 గంటలు వెలిగితే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది.                                                                
వాక్యుమ్ క్లీనర్  ఒక గంట 30 నిముషాలు పని చేస్తే ఒక యూనిట్ ఖర్చవుతుంది.        
గీజర్  30 నిముషాలు పని చేస్తే   ఒక యూనిట్ ఖర్చవుతుంది. 
మిక్సీ రెండు గంటలు వాడితే  యూనిట్ ఖర్చవుతుంది. 
ఏసీ  30 నిముషాలు పని చేస్తే   ఒక యూనిట్ ఖర్చవుతుంది. 
వాషింగ్  మెషీన్ ఒక  యూనిట్ కు 4 గంటలు పనిచేస్తుంది
ఐరన్ బాక్స్ రెండు గంటల 30 నిముషాలు పని చేస్తే ఒక యూనిట్ ఖర్చవుతుంది.        
కంప్యూటర్ పది గంటలకు ఒక యూనిట్, రిప్ర్హిజిరేటర్  ఏడు గంటలకు, టెలివిజన్ ఎనిమిది గంటలకు, నీటి పంపు మూడు గంటలకు, ఒక యూనిట్ ఖర్చవుతుంది.
పై లెక్కలు దృష్టిలో పెట్టుకుని  విద్యుత్ ను పొదుపు చేద్దాం.

Tuesday 4 September 2012

గురువులందరికీ అభినందనలు!


లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, ఒక గొప్ప తత్వవేత్త ...ఆయనే డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు.  ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి  అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు .  గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు.  ఈ  సందర్భంగా  గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!

Sunday 2 September 2012

పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.  అధికార పక్షం మొండిగా వ్యవహరించడం,  ప్రధాన ప్రతిపక్షం దానికి ధీటుగా సభను సాగనీయకుండా చేయడంలోనే పార్లమెంట్  సమావేశాల సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన పార్లమెంట్ ని  కొందరు నేతలు పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది.  ప్రజాస్వామ్య వాదులకు ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ లోపించడం ప్రజల దురదృష్టకరం.  వీరికి వీరి మిత్ర పక్షాలుత్తాసు  పలకడం శోచనీయం. దీంతో ఎనిమిది  రోజుల పాటు ప్రజాసమస్యలను చర్చించకుండా, కాగ్ బొగ్గు నివేదిక పైనే పార్లమెంట్ ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం. సభను జరగకుండా చేయడంలో అధికార పక్షం, ప్రధాన ప్రతి పక్షం రెండూ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.