ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమిచ్చారు. వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి ఉత్తర దివ్యదర్శనంతో పులకించి పోయారు. భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. మరో ప్రక్క బంగారు కాంతులీనే ఆనంద నిలయం. ఎటు చూసినా అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలు చేసే బృందాలు...గోవిందనామస్మరణలు. భక్తుల ముఖాల్లో ఆనందం ...సంతృప్తి.