పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అధికార పక్షం మొండిగా వ్యవహరించడం, ప్రధాన ప్రతిపక్షం దానికి ధీటుగా సభను సాగనీయకుండా చేయడంలోనే పార్లమెంట్ సమావేశాల సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన పార్లమెంట్ ని కొందరు నేతలు పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది. ప్రజాస్వామ్య వాదులకు ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ లోపించడం ప్రజల దురదృష్టకరం. వీరికి వీరి మిత్ర పక్షాలు వత్తాసు పలకడం శోచనీయం. దీంతో ఎనిమిది రోజుల పాటు ప్రజాసమస్యలను చర్చించకుండా, కాగ్ బొగ్గు నివేదిక పైనే పార్లమెంట్ ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం. సభను జరగకుండా చేయడంలో అధికార పక్షం, ప్రధాన ప్రతి పక్షం రెండూ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.