”శోధిని”

Monday 15 October 2012

శరన్నవరాత్రులు



           శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో ఆయా దేవిలను పూజిస్తారు.  ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యంగా మొదటిరోజు (16-10-12) శ్రీ బాలా త్రిపురసుందరీ దేవికి పరమాన్నం, రొండో రోజు(17-1012) శ్రీ దేవి లలితాంబ అమ్మవారికి దద్దోజనం, మూడో రోజు(18-10-12) శ్రీ గాయత్రిమాతకి చక్రపొంగలి సమర్పిస్తారు. నాలుగో రోజు (19-10-12) శ్రీ అన్నపూర్ణా దేవికి పులగం, ఐదో రోజు (20-10-12)సరస్వతి దేవికి పులిహొర, ఆరోరోజు (21-10-12) శ్రీ మహాలక్ష్మి దేవికి  పెసరపప్పుతో చేసిన వంటకం, ఏడో రోజు (22-10-12) శ్రీ దుర్గామాతకి బెల్లంతో వండిన పదార్థాలు, ఎనిమిదో రోజు (23-10-12) శ్రీ మహిశాసురమర్దినికి గారెలు, తొమ్మిదో రోజు (24-10-12) శ్రీ రాజరాజేశ్వరీ దేవికి ఆరు రుచులతో కూడిన వంటలు సమర్పిస్తారు.

          ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగు అంటే అమితమైన ఇష్టం.  అందుకే కుంకుమ పూజకు అంత విశిష్టత.  అలాగే ఎర్ర పూలన్న, ఎర్రని వస్త్రాలన్నఆమెకి ప్రీతి. అమ్మ వారికి అనేక నామాలున్నాయి.  గ్రామాలలో అయితే ఎల్లమ్మ, నూకాలమ్మ, బతుకమ్మ, పైడితల్లి అని, పట్టణాలలో అయితే బెజవాడ కనకదుర్గ, శ్రీ శైల భ్రమరాంబ, మధుర మీనాక్షి, కాశీ  విశాలాక్షి,  కంచి కామాక్షి, శృంగగిరి శారదాంబ అంటూ పిలుస్తారు.

          నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో  పూజిస్తే  సర్వ మంగళాలు ప్రసాదించి, సంరక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

          బ్లాగు మిత్రులందరికీ అమ్మ సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను.