”శోధిని”

Sunday 7 October 2012

చెత్త సమస్య



          నగరాలలో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్త కుప్పలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ సమస్య మరింత తీవ్రతరం కానుంది.  ఇప్పటికే చెత్త వేయడానికి స్థలం దొరక మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  ప్రస్తుతం డంపింగ్ చేస్తోన్న స్థలాలు చెత్త చెదారంతో నిండి పోతున్నాయి.  ఈ పరిస్థితుల్లో చెత్తను ఎక్కడికి తరలించాలో తెలియక నివాస స్థలాల  మధ్యనే పడేస్తున్నారు.  వర్షాకాలం కావడంతో దోమలు, ఈగలు విలయతాండవం చేయడంతో పలువురికి అంటువ్యాధులు సోకుతున్నాయి.  చెత్త చెదారంతో  మురికి పేరుకుపోయిన  అపరిశుభ్రత కారణంగా ఈగలు ఆహార పదార్థాలను కలుషితం చేస్తున్నాయి.  చెత్త సమస్యకు పరిష్కారం కనుక్కోలేని పాలకులు రాష్ట్రాన్ని ఎలా ముందుకు  నడిపిస్తారో అర్థం కావడం లేదు.  ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు చెత్తను సద్వినియోగం చేసుకునే మార్గాల కోసం అన్వేషించాలి.  చెత్తే కదా అని నిర్లక్షం చేస్తే కాలుష్యం కాటేయ్యడానికి సిద్ధంగా వుంది. మాయదారి మాయరోగాలు పొంచి వున్నాయని గ్రహించాలి. వెంటనే తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలి.  పారిశుద్ధ్య లోపం... ప్రజారోగ్యానికి శాపం కాకుండా చూడాలి.