”శోధిని”

Friday 17 January 2014

'మనసంతా నువ్వే'



ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ ఆర్. వి. ఎస్ .ఎస్ శ్రీనివాస్ గారు (శ్రీ) రచించిన 'మనసంతా నువ్వే' వచన కవితల సంపుటిని  డా. సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు.  ఈ గ్రంధంలో 64 కమనీయమైన ప్రేమ కవితలు రూపుదిద్దుకున్నాయి.  కవితలలో ఆత్మీయ స్పర్శల మధురానుభూతుల్ని, ప్రేమికుల సంబంధాలను హృద్యంగా వర్ణించారు రచయిత. ఈ గ్రంధంలోని కవితలు చదువుతుంటే... హృదయ లోతుల్లో దాగిన అక్షరాలను పైకి తీసి పేర్చినట్టున్నాయి.  ఈ గ్రంధంలోని కొన్ని మధురమైన వాక్యాలు... 

" నీ ప్రేమలేఖ లొని అక్షరాలు 
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు 
నిశ్చలమైన నా మనోకాసారంలో 
వికసించిన ప్రేమారవిందాలు"

"సాయంసంధ్యా సమయంలో 
చల్లగా వీచే పిల్లతెమ్మర హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన 
ప్రణయ సమీరంలా"

" నీ చిరునవ్వుల జల్లులు చాలు 
చిరుకవితల మాటలు అల్లేందుకు 
నీ పసందయిన పలకరింపులు చాలు 
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు"

ఈ గ్రంధం నిండా ఇలాంటి కవితలు మనోరంజకంగా అలరించాయి.  ఎన్నెన్నో మధురానుభూతులు మనసును తట్టి ఆహ్లాద పరచాయి.  తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగల శక్తి శ్రీనివాస్ గారికవిత్వానికి ఉందని రుజువు చేశాయి.  ఈ కవితలలో రచయిత హృదయ స్పందనని అర్థం చేసుకోవచ్చు. అద్భుత పదాలతో "మనసంతా నువ్వే"కవితల సంపుటిని 64 ఆణిముత్యాలుగా అభివ్యక్తీకరించారు 'శ్రీ' గారు. మున్ముందు మరిన్ని  ప్రేమ కవితలు 'శ్రీ' (శ్రీనివాస్) గారి కలం నుండి జాలువారుతాయని ఆశిద్దాం!