”శోధిని”

Wednesday 2 July 2014

సమస్యల వలయం!

జూన్ పోయింది ... జూలై వచ్చింది.  అయినా వాన చినుకు లేదు.  ఊరిస్తూ వర్షించని ఆకాశం వైపు రైతులు  ఎదురు చూస్తున్నారు.  ఒకప్రక్క రాజకీయనాయకులు,  మరోప్రక్క వరుణదేవుడు మోసం చేయడంతో దేశానికి వెన్నుముక అయిన రైతులలో  దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జలాశయాలు అడుగంటడం, చాలినంత బొగ్గు అందుబాటులో లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బేరసారాలకు పోవడంతో సమస్య మరింత జటిలమయింది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయి రెండు రాష్ట్రాల సమస్యల పైన చర్చించి,  ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అడుగులు ముందుకేస్తే ప్రజలు సంతోషిస్తారు.  లేకుంటే రెండు రాష్ట్రాలు తీవ్ర కరవుబారినపడే ప్రమాదం లేకపోలేదు.  ఇది  పంతాలకు పోయే సమయం కాదు.  ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి నెలరోజులు దాటినా ఇంతవరకూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాకపోవడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులిద్దరూ వెంటనే సమావేశంమయి,  ఉమ్మడి సమస్యల పైన చర్చలు జరపాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.