”శోధిని”

Sunday 18 November 2012

మన తెలుగు సినిమాలకు గ్రహణం


    మన హిందూ సంస్కృతిలో బ్రాహ్మణులకు మర్యాదపూర్వక మైన గౌరవం వుంది. హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని వారినుండి ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. దేవాలయాలలో దేవుడిని దర్శించుకున్నాక పురోహితుడి పాదాలకు మొక్కుతారు.  అలాంటి  ఉన్నతమైన వ్యక్తిని సినిమాలలో పెట్టి హాస్యం పండించాలనుకోవడం మెడ మీద తలకాయ వున్నవారు ఎవరూ ఆలోచించరు.  

  అదేవిధంగా మన సమాజంలో ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రద మైంది. సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉపాధ్యాయుని ప్రభావం కచ్ఛితంగా ఉంటుంది. తల్లితండ్రుల తర్వాత మనిషి వ్యకిత్వ వికాసంలో అద్యాపకులదే కీలక పాత్ర. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్య పాత్ర ఉపాద్యాయులదే. అలాంటి గురువులను సినిమాలలో జోకర్ గా చూపించి విద్యార్థుల చేత ఆట పట్టించడం ఎంతవరకు సమంజసమో దర్శక, నిర్మాతలు ఆలోచించాలి. సినిమా ప్రారంభం రోజు ఏంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడికి కొబ్బరకాయ కొట్టి తొలి ముహూర్తపు షాటు తీస్తారు. అలా పవిత్రంగా మొదలైన సినిమా నిండా బూతు సన్నివేశాలు నింపడం ఎందుకో  సినీ పెద్దలకే తెలియాలి.

      సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి.  వాటి పరిష్కార దిశగాఎన్నో చిత్రాలను తీయవచ్చు. అలా చేయకుండా సమాజాన్ని అవమానపరచేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలను నిర్మించాలనే ఉద్దేశం దర్శక, నిర్మాతలకు కలగడం చారించతగ్గ విషయం.  ఎప్పటికైన సినీపెద్దలు కొంచెమయినా నైతికంగా ఆలోచించాలి.  అశ్లీలత, అసభ్యతే లక్ష్యంగా కొన్ని వర్గాలను కించపరచే విధంగా సినిమాలను నిర్మించి, ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని గుర్తించాలి.  ఆర్ధిక ప్రయోజనాల కోసం కులాలను వాడుకోవడం, కొన్ని ప్రాంతాలవారిని అవమానపరచడం సంస్కారం అనిపించుకోదు.

        అక్టోబర్, నవంబర్ లో విడుదలయిన కొన్ని సినిమాలను చూస్తుంటే అసలు తెలుగు సినిమాలకు సెన్సార్ బోర్డు  అన్నది ఒకటి ఉందా? అనిపిస్తుంది.  ఎందుకంటే ఈ రెండు నెలలలో వచ్చిన చిత్రాలలో కొన్ని సామాజికవర్గాలను కించపరచే సన్నివేశాలు, విచ్చలవిడిగా బూతుల మాటలు, అశ్లీలత సన్నివేశాలు, దబుల్ మీనింగ్ డైలాగులున్న సినిమాలకు సెన్సార్  ముద్రవేసి సమాజం పైకి వదిలేశారు.సెన్సార్ సభ్యులకు సినిమాలలోని బూతు మాటలు వినిపించలేదు.  హీరోయిన్ జానెడు బట్టలు కట్టి గెంతినా కనిపించలేదు.   పనిగట్టుకొని ఓ వర్గాన్నో, మతాన్నో కించపరచినా పట్టించుకోలేదు .  ఇలాంటి  సెన్సార్ మెంబర్స్ మనకు దొరకడం మన తెలుగువారి దౌర్భాగ్యం.