”శోధిని”

Saturday 21 January 2012

"పరిధి దాటిన వేళ" కథ పై నా విశ్లేషణ

కథాజగత్,  కథావిశ్లేషణ పోటీకి ! 

రచయిత శ్రీ పి.వి.బి. శ్రీరామమూర్తి గారు వ్రాసిన"పరిధి దాటిన వేళ" కథపై నా విశ్లేషణ
 *******

        కథలో వర్ధనమ్మ బిపీ పేషెంట్.  బిపీ మందులు అయిపోవడంతో మందుల కోసం రోడ్డు పైకి వెళ్ళాల్సి వస్తుంది.   'రోడ్డు పైన ఎదైనా ప్రమాదం జరిగితే నలుగురు ఏమనుకుంటారు?' అని కుటుంబ సభ్యులు సూటి పోటు మాటలతో భాదిస్తారు. ఆమె ఆరోగ్యం కంటే వాళ్ళ పరువు,మర్యాదలే ముఖ్యంగా భావిస్తారు.  ఆమె తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించిందో, వాళ్ళు ఆమె పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కథలోని ఇతివృత్తం. కన్నబిడ్డలు పట్టించుకోకపోవడం, భర్త బాధపెట్టె మాటలు ఇలాంటి సంఘటనలు వర్ధనమ్మ పాత్రను తీర్చి దిద్దాయి.   కథలో మానవ మనస్తత్వంలోని వైవిధ్యాన్ని విశ్లేషించడం జరిగింది.   కథ రాయడంలో రచయిత చాలా అధ్యాయనం  చేశారనిపిస్తోంది.  వర్ధనమ్మ మానసిక సంఘర్షణ స్పష్టంగా చిత్రించబడింది.  ఆమె కాపురంలో ముప్పయ్ ఏళ్ళలో ఆమె పడిన బాధలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.  ఇలాంటి సంఘటనలు మనకు ఎక్కడో తారస పడినట్లు ఉంటుంది.

        భర్త చెడు తిరుగుళ్ళు తిరిగినా నీలో ఏదో లోపం ఉంది కాబట్టే వాడు బయట తిరుగుతున్నాడని అత్తమామలు       అనడం అన్యాయం.  కనీసం తల్లిదండ్రులతో చెప్పుకుంటే కాస్తన్నాన్యాయం జరుగుతుందనుకుంటే 'లేనిపోని వెధవ ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దని, అసలు ఇలాంటి విషయాలు మాదాగా తీసుకు రావద్దని మందలించే తల్లిదండ్రులు ఉన్నంత కాలం కోడలనేస్త్రీ’కి బాధలు తప్పవు.  విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వర్ధనమ్మ జీవితంలోఆటుపోట్లను తట్టుకోలేక ఒకదశలో ఆత్మ హత్య చేసుకుందామనుకుంటుంది.  తరువాత మనసు మార్చుకుని చనిపోతే సాధించేదేముంది, బ్రతికి సాధించాలనుకుంటుంది.  ఇన్నాళ్ళు ఆమె ఒక యంత్రంగా పనిచేసి అరిగి పోయింది.  ఒక ఆప్యాయత లేదు,అనురాగంలేదు.  అందుకే ఆమెలో ఓపిక నశించింది.  కట్టుకున్న వాడికే ప్రేమ లేనప్పుడు కన్నబిద్దలకి ఎందుకుంటుంది? భర్త మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వుండడం ఎన్నాళ్లని సహిస్తుంది.  వయసులో ఉన్నప్పుడు  భర్త అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రో ఇంటికి చేరితే కనురెప్పలు ముతపడిపోతున్న భర్త కోసం అన్నం తినకుండా ఎదురుచూడడం, అతను తిన్న తర్వాత తను తినడం,రాత్రి పడక గదిలో అతను పెట్టె హింసను భరించడం ఒక్క వర్ధనమ్మకే సాధ్యపడింది.

         ఎన్నో బాధలు అనుభవించిన వర్ధనమ్మ ఇంట్లోనుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నదంటే ఆమె మనసు ఎంతగా ఘోషించిందో అర్ధమవుతుంది .  పెద్దవాళ్ళకి కూడా మనసు ఉంటుందని, వాళ్లకి కోరికలు ఉంటాయని నేటి యువత ఆలోచించడం లేదు. అందుకే ఆమె మనోవ్యధను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్ణయానికి వచ్చింది. అదృష్టవశాత్తు టీవీ ప్రకటన ఆమెకి దారి చూపింది.   ప్రకటన వర్ధనమ్మలో నిజంగానే వెలుగు నింపింది. పనిమనిషిగా, తోటి స్త్రీకి తోడుగా ఉండటానికి నిర్ణయం తీసుకోవడంతో కథ ముగుస్తుంది.  అత్యంత సహజంగా వర్ధనమ్మ పాత్రను కనుల ముందుంచిన రచయిత శ్రీ పి.వి.బి . శ్రీరామమూర్తి గారికి అభినందనలు.