ప్రకృతిలో జరిగే మార్పులకు వేదిక మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు ఆరు నెలలు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయనంలోకి అడుగు పెడతాడు. ఆ రోజునుంచి హైందవ సంప్రదాయం ప్రకారం అత్యంత శుభాదాయకరమైన సమయం. పితృదేవతలకు పిండివంటలు, కొత్త బట్టలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు తృప్తి పడతారని గట్టి విశ్వాసం. ఈ విధంగా పెద్దలకు భక్తి ప్రపత్తులతో నైవేద్యం సమర్పించుకోవటం సంక్రాంతి ప్రత్యేకత. హరిదాసులు, గంగిరెద్దులవాళ్ళు, పగటివేశాగాల్లతో గ్రామాలన్నీ కళను సంతరించుకుంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేవడం, ఇంటిముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేయడం, పసుపు, కుంకుమలతో ఇంటి గడపను అలంకరించడం ఆనవాయితి. సంక్రాంతి అంటే మన సంప్రదాయాని మరచిపోకుండా గుర్తుచేసుకోవడం. మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి వాకిళ్ళు కళకళ లాడుతూ ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసార కోరుకుందాం.