”శోధిని”

Thursday, 15 December 2016

మానవ సంబంధాల మధురిమలు !

నేటి యువతకు సరదా కావాలి.  సద్దుబాటు అక్కర్లేదు.  సంతోషం కావాలి...భాద్యత అవసరం లేదు.  వారిలో  వికృత చేష్టలు ... వెర్రితలలు  తిష్ట వేయడంతో  తల్లిదండ్రుల పట్ల ప్రమానురాగాలు మృగ్యమైపోతున్నాయి. అక్కడక్కడ ఇంకా కొందరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కాబట్టి, ఇంకా మనవ సంబంధాల మధురిమలు మిగిలే ఉన్నాయి.  వాటిని మనం నిరంతరం కాపాడుకోవాలి.  ప్రేమ, గౌరవం అనేవి ఒకరిస్తే వచ్చేవి కావు.  మన మంచితనంతో మనమే సంపాదించుకోవాలి. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు,  పిల్లలకు సత్ప్రవర్తన, సభ్యత ,సంస్కారం నేర్పించి మానవీయ విలువలను వారికి బోధించాలి. పెద్దవాళ్ళను గౌరవించడం, ప్రేమించడం నేర్పి, మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచకుండా చూడాలి.

Sunday, 11 December 2016

అవినీతి అధికారుల భరతం పట్టాలి.

అవినీతి అధికారుల భరతం పట్టాలి.
పెద్దనోట్ల రద్దువల్ల సామాన్య ప్రజలకు నిత్యం ప్రత్యక్షనరకం కనపడుతోంది. పనులు మానుకొని బ్యాంకుల ముందు గంటలతరబడి నిల్చున్నా డబ్బులు అందక ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. నెలంతా కస్టపడి సంపాదించుకున్న డబ్బును పొందలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు , కూరగాయలు కొనేందుకు డబ్బులు లేక నిత్యం నరకయాతన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మేలు చేస్తుందేమో కాని, ఇప్పుడు మాత్రం ప్రజలు దినదినగండంను చవిచూస్తున్నారు. నల్లడబ్బు దాచుకున్న కుబేరులు మాత్రం కొందరు అవినీతి బ్యాంకు అధికారుల సహాయంతో కోట్ల రూపాయల కొత్త నోట్లు అందుకుంటున్నారు. అక్రమమార్గంలో నడిచే కొందరు బ్యాంకు అధికారులు పర్సెంటేజీలు తీసుకొని నల్లడబ్బున్న బదాబాబులకే కొత్తనోట్ల కట్టలు పంపిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం మొండిచెయ్యి చూపిసున్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమే. కాని, కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయ ఫలితాలు ప్రజలకు చేరాలంటే, అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాలి.


Sunday, 27 November 2016

బాబోయ్... రెండువేలనోటు !



ఒక మంచి లక్ష్యంతో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం.  పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం.ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమే కానీ, అమలులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటు వల్ల పరిస్థితి మరింత చెయ్యిదాటి పోయింది. ఆనోటే సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.   అన్ని రంగాలలో ఈ నోటు తీవ్ర ప్రభావితం చేసింది. సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండువేల నోటు స్థానంలో అయిదువందల నోటు ప్రవేశపెట్టి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదికాదు. ఇప్పుడు రెండువేల నోటు ప్రజలకు తలనొప్పిగా మారింది.  దాన్ని చూడగానే ప్రజలు భయపడుతున్నారు.  ఈ నోటే దేశంలో చిల్లర సమస్యను తెచ్చిపెట్టింది.  ఈ నోటువల్ల సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగాలేదని స్పష్టంగా  అర్థమవుతోంది.  చిన్న వ్యాపారాల మీద ఈ పెద్దనోటు ప్రభావం తీవ్రంగా ఉంది. తక్షణమే అయిదువందల నోట్లు దేశమంతా అమలులోకి వస్తే, నోట్ల సమస్య అతిత్వరగా సమసిపోతుంది. అన్ని బ్యాంకుల్లోనూ,  ఏటియంలలోనూ వంద, అయిదువందల నోట్లు విరివిగా పంపిస్తే, ప్రధాని ప్రయత్నం సఫలం అవుతుంది. 

"తెలుగు సినిమా"

పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి. నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు. అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని ప్రబోధించేవారు. ఆ దిశగా రచయితలు కూడా రచనలు చేసేవారు. వాటి ప్రభావం సమాజంపై ఉండేది. మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ, నేడు వస్తున్న సినిమాలలో అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు. కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప, అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు. దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.