”శోధిని”

Tuesday, 17 July 2012

వర్షాకాలంలో కరెంట్ కోతలా?




        మన రాష్ట్రంలో వర్షాకాలంలోనూ కరెంట్ కోట కొనసాగుతోంది.  ఫలితంగా విద్యుత్ ను నమ్ముకుని జీవిస్తున్న వినియోగదారులు, పరిశ్రమ యజమానులు తీవ్రఆందోళనచెందుతున్నారు.  ఎండాకాలం లో రోజుకు రెండు గంటలు కోట విధించిన అధికారులు , వర్షాకాలం వచ్చేసరికి ఒక సమయం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కరెంట్ ను నిలిపివేసి వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు.  ఇప్పటికే విద్యుత్ చార్జీలతో సతమత మవుతున్న ప్రజలకు ఈ కోత వల్ల పుండుమీద కారం చల్లినట్టుంది.ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

         మన పాలకులు ఎంతసేపు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే చూస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోంది.  హైదరాబాద్ నుంచి డిల్లీ కి ఎన్ని సార్లు చక్కర్లు కొట్టినా, ఏనాడు అయినా ప్రజా సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడినట్టు కనిపించిన దాఖరాలు లేవు.  ఎప్పుడూ "జగన్ ని ఎలా కట్టడి చేయాలి? తెలంగాణా లో పార్టీని ఎలా బ్రతికించుకోవాలి? 2014లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి?"అని ఆలోచిస్తున్నారే కానీ, ప్రజల సమస్యల గురించి  అసలు పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలి.  

Saturday, 14 July 2012

రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తున్న 'ఈగ'





        దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఈగ' చిత్రం జూలై 6 న విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ తో రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తోంది.  'ఈగ' సంచలన విజయాన్ని సాధించడంతో, త్వరలో విడుదల కావలసిన చిత్రాల తేదీలు చక చక ముందుకు మారి పోయాయి.  కొందరయితే అసలు విడుదల తేదీని ప్రకటించడానికే భయపడుతున్నారు. 'ఈగ' దెబ్బకు ఇలా వాయిదా పడ్డ చిత్రాలలో "జులాయి", "దేవుడు చేసిన మనషులు",   'ఊకొడతారా --ఉలిక్కి పడతారా", "డమరుకం"  లాంటి పెద్ద చిత్రాలు కూడా ఉండటం విశేషం.

        ఒక చిత్రం విడుదలయి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా 'హీరో'దేనని అభిమానులు నానా హంగామా . 'ఈగ' చిత్రం చూసాక తెలిసిందేమిటంటే, విజయానికి ప్రధాన కారణం దర్శకుడేనని.  పెద్ద స్టార్స్ లేకుండా కేవలం ఒక ఈగనే నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించిన రాజమౌళి నిజంగా దమ్మున్న దర్శకుడు. సినిమా విజయం సాధించడానికి దర్శకుడే  ముఖ్యమని ఈ చిత్రం రుజువు చేసింది.  ఈ చిత్రంలో యామినేషన్ ప్రక్రియ పిల్లలను రంజింప చేస్తే, పెద్దలను కూడా ఆకట్టుకునే విధంగా రూప కల్పన చేయడంలో రాజమౌళి విజయం సాధించాడు.

        విలన్ గా  నటించిన కన్నడ నటుడు సందీప్ నటన 'ఈగ' చిత్రానికి హైలెట్.సమంత కు మంచి గ్లామర్ పాత్ర దొరికింది.  నాని ఉన్నంత సేపు తెరపై మంచి నటనను కనబరచాడు.  కథ విషయానికొస్తే హీరోని చంపిన విలన్ పై పగతీర్చు కోవడానికి 'హీరో' ఈగగా  పుట్టడం. కథ చిన్నదే అయినా దాన్ని తెర పైన చూపించిన  విధానం ప్రశంసనీయం.  గ్రాఫిక్ ఈగను సృష్టించి , దాని చేత రకరకాల విన్యాసాలు చేయించడంలో రాజమౌళి మరో విఠాలాచార్యలా వైవిద్యం ప్రదర్శించాడు. హాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా గ్రాఫిక్ చిత్రాలను నిర్మించ గలదని స్పష్టం చేసిన రాజమౌళి అభినందనీయుడు.  ఈగ చిత్రాన్ని ఒక థ్రిల్లర్ గా , ఎంటర్ టైనర్ గా  రూపొందించడంలో రాజమౌళి నూటికి నూరు శాతం విజయం సాధించాడు. పిల్లలతో కలసి పెద్దలు చూడాల్సిన  చిత్రం 'ఈగ'.

Saturday, 7 July 2012

ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న సెల్ టవర్లు




       నేడు మానవుని జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం కావడంతో సెల్ ఫోన్ లేనిదే   క్షణం కూడా గడవని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సెల్ ఫోన్ కి సిగ్నల్ అందించే సెల్ టవర్లు జనావాసాల మధ్య కొలువై ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.  భవనాల  యజమానులు వివిధ సెల్ ఫోన్ కంపెనీ వారిచ్చే డబ్బుకు ఆశపడి  తమ భావనాల పై సెల్ టవర్లు నిర్మించుకోవడానికి  ఏళ్ళ తరబడి లీజుకు ఇస్తున్నారు.  సెల్ టవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండటంతో ప్రజలు అనేక సమస్యలనుఎదుర్కొంటున్నారు.  ఈ సెల్ టవర్లు విడుదలచేసే రేడియేషన్ ద్వారా చర్మ వ్యాధులు, మానసిక రుగ్మతులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలపై అధిక ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.మరో ప్రక్క పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.  ఎప్పుడూ మన మధ్యనే వుంటూ మనల్ని' ఆత్మీయుల్లా 'కిచ...కిచ...'అంటూ పలకరించే పిచ్చుకలు ఈ సెల్ టవర్ల వల్ల కనుమరుగవుతున్నాయి. ఈ సెల్ టవర్ల నిర్మాణాల విషయంలో నియంత్రణ లేకపోవడంతో  ఎక్కడ  బడితే అక్కడ విచ్చల విడిగా టవర్లను నిర్మిస్తూ ... ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గృహ సముదాయాల మధ్యనే ఈ టవర్లను నిర్మించడం, నిబంధనలు పాటించక పోవడం ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రాణాంతక మైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటి కైన ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని , సంబంధిత అధికారులు సెల్ టవర్ల ఏర్పాటు విషయంలో కఠిన చర్యలు అవలంభించాలి.  జనావాసాలకు దూరంగా సెల్ టవర్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Saturday, 30 June 2012

పండ్లు తింటే...




     ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చిపెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా ఉండదు.  ఇది పచ్చి నిజం. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లు నేడు మార్కెట్లో  కనబడడంలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  పండ్లు త్వరగా మగ్గడానికి వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం అడ్డదారి తొక్కుతున్నారు.  పండ్లను మగ్గపెట్టడం కోసం ఇటీవల కాలంలో పలు ప్రాంతాలలో అనేక ఫ్రీజర్లు వెలసాయి.  అయితే వీటికి అనుమతులున్నాయా? అనుమతులు ఎవరు ఇచ్చారు? తెలియని పరిస్థితి.  పలు ప్రాంతాలలో కూడా ఇళ్ళలో కూడా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.  పండ్లను మగ్గించడానికి రసాయనాలను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. ఇలా రసాయనాలతో  మగ్గించిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  డబ్బులను పెట్టి జబ్బులను కొంటున్నామని తెలుసుకోలేక పోతున్నారు.  ఇంత పబ్లిక్ గా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకొనేవారు  కరువయ్యారు.  ప్రభుత్వ అధికారులు మామూళ్ళ వేటలో ... పాలకులు అధికారాన్ని ఇలా నిలబెట్టుకోవాలని ఆలోచనలో మునిగి పోయారు.  అందుకే పండ్లను కొనేముందు  బాగా పరిశీలించి కొనండి. రసాయనాలతో మగ్గించిన పండ్లను  సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ పండ్లు గట్టిగా పసుపువర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లను, రసాయనాలతో మగ్గించిన పండ్ల మధ్య తేడా గుర్తిస్తే , ఆరోగ్యానిచ్చే పండ్లను తినవచ్చు.



Tuesday, 19 June 2012

పిల్లలతో వెట్టి చాకిరీ



ఇంటిపని కోసం బాలికలను ఉపయోగించుకోవడం సహించరాని నేరం.  మనకు ఎన్ని చట్టాలున్నా దురాచారాన్ని ఆపలేక పోతున్నాం. ప్రభుత్వం ఇంటి పనిని కూడా బాల కార్మిక చట్టం కిందికి తెచ్చింది కానీ, నేడు ఆర్ధికంగాను ఉన్నత స్థాయిలో వుండే వ్యక్తులు  బాల కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. చట్టాలు ఇతరులకే కానీ మనకు కాదని వాళ్ళ ధోరణిటీవీ లోనూ, మీటింగ్ లలోనూ బాల కార్మికుల నిర్మూలనే తమ ద్యేయం అంటూ  ఉపన్యాసాలు దంచేస్తారు. వీరి విషయానికి వచ్చేసరికి అవి కనిపించవు.  బాల కార్మికుల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అధికారులే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డునపడుతున్నారు. అధికారులు ఇలా ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంగించడమే అవుతుంది. న్యూస్ పేపర్ యాజమానులు  బాలకార్మికుల గురించి తెగ రాసేస్తుంటారు. వాళ్ళ పైన ఎక్కడలేని  ప్రేమ ఒలకపోస్తారు. కానీ, వారి పేపర్ ప్రింట్ అయిన దగ్గర నుంచి ప్రజలకు చేరే వరకు బాల కార్మికులతోనే పని చేయించుకుంటున్నారు.  ఎదుటి వారికి నీతులు చెప్పడమే కానీ మనకు కాదని వాళ్ళ ఉద్దేశం కాబోలు.  మగపిల్లలు  హోటల్స్ లోనూ, చిన్న చిన్న పరిశ్రమలలోనూ శ్రమ దోపిడీకి గురవుతుంటే , ఆడపిల్లలు ఇంటిపనిలో 24 గంటలు  చాకిరీ చేస్తూ లోలోన కుమిలి పోతున్నారు.  పని సరిగా చేయడంలేదని యజమానులు  వేధించడం, కొట్టడం జరుగుతోంది.  ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప, బాలకార్మికులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచడంలేదు.  

Saturday, 16 June 2012

వానా ...వానా ...వందనం!


         



          వారం నుంచి ఊరిస్తూ వస్తున్న  ఋతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.  తొలకరిజల్లులు పుడమితల్లిని ముద్దాడటంతో మూడు నెలలనుంచి ఎండలకు బేజారయిన ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. వేసవి తాపాన్ని నుంచి బయట పడి చల్లదనాన్ని ఆస్వాదించారు.  చిరుజల్లులకు పుడమితల్లి పులకరించడంతో చల్లని గాలులు వీచాయి.  ఆకాశంలో కమ్ముకున్న నీలి మేఘాలు ఆహ్లాదకర మైన వాతావరణాన్ని అందించాయి.  వాతావరణంలో చోటుచేసుకున్న తేమ గాలులు రాష్ట్ర ప్రజలను ఆనందింప చేసింది.  చిరుజల్లులు పడటంతో కోటి ఆశలతో  రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.  కానీ, ఆశించినంత వర్షాలు కురవకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  సాధారణంగా జూన్ మెదటి వారం నుంచే భారీ వర్షాలు కురవాలి.  మూడో వారం నడుస్తున్న పెద్దగా వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి.  పరిస్థితిలో రైతులను వరుణ దేవుడే ఆదుకోవాలి.

Wednesday, 13 June 2012

నాయకుల దొంగాట


ఈరోజు 'ఈనాడు లేఖలు'  శీర్షిక లో ప్రచురించారు.