”శోధిని”

Saturday, 5 May 2018

శేషాద్రి




సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠoలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పాడు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏమిచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో ఆదిశేషుడు తన పడగ ఎత్తి చూశాడు. దాంతో పట్టు సడలి వాయుదేవుడు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.


Monday, 30 April 2018

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

ఆనాడు కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలో తప్ప , ప్రైవేటు కార్యాలయాలు, కర్మాగారాలలో ఇప్పటికీ కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపే రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.

Saturday, 14 April 2018

ఇది మల్లెలమాసం....

                                                                                                                                    మన కళ్ళ ఎదుట మల్లెపూలు  కనిపించినా, వాటి వాసనలు తగిలినా మానసిక ప్రశాంతత అభిస్తుంది. సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.   అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చే శక్తి ఈ పుష్పాలకుంది.   మండుటెండలో ఆహ్లాదాన్ని కలిగించే పుస్పాలలో మల్లెలది ప్రధమస్థానం.  ఎంత ఎండ కాచినా, పచ్చగా కళకళలాడే ఆకుల మాటున తెల్లని మల్లెమొగ్గలు మురిపిస్తాయి. తమ సుగంధాలతో పరిసరాలను నింపేసి ఉత్సాహాన్ని ఇస్తాయి. మనసును సమ్మోహన పరచి ఏదో లోకానికి తీసుకెలతాయి.  మధురోహాలతో పులకింపజేసి మొహనరాగాలను పలికిస్తాయి.    కమ్మదనానికి, చల్లదనానికి పెట్టింది పేరయిన మల్లెలంటే అందరికీ ఇష్టమే. మల్లెల మాధుర్యం మాటల్లో చెప్పలేనిది.  వాటి పరిమళాలకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే!                                                                                    

Friday, 13 April 2018

సప్తగిరులు

శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే తిరుమలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులని పురాణప్రతీతి. పచ్చనిలోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే సప్తగిరులు.



Thursday, 29 March 2018

నేడు ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం

చైత్ర శుద్ధ నవమి నాడు దేశమంతా శ్రీ సీతారామ కళ్యాణం జరిపితే,  ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చైత్రమాసం పున్నమినాడు  వెన్నెల వెలుగులో కోదండరాముని కల్యాణం  నిర్వహించడం ఈ  ఆలయం  ప్రత్యేకత!  అంతేకాదు శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు  ఘనంగా నిర్వహిస్తారు.  ఇక్కడ సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఒంటిమిట్టను  'ఏకశిలానగరం' అని కూడా పిలుస్తారు.  ఆంజనేయుడు లేని రామాలయం కూడా బహుశా ఈ ఆలయమే.  హైదరాబాద్ నుండి మా  స్వగ్రామం వెళ్ళే రహదారిలో ఈ క్షేత్రము ఉంది.  చిన్నప్పుడు  తోటి స్నేహితులతో కలసి  తరచూ ఈ క్షేత్రాన్ని దర్శించుకొనేవాళ్ళం. 




మనుషులంతా ఒక్కటే!