”శోధిని”

Sunday, 22 January 2012

కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న రెండో కథ 'పరివర్తన'


కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న రెండో కథ  'పరివర్తన' - రచయిత్రి : పి.వి. సుజాతారాయుడు  
                                                                                                                                                                    - కాయల నాగేంద్ర 
  
           కథ పాతదే అయినా కథనం ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది.  కాలం మారినా వితంతువుల జీవితాలు మారలేదు.
        ఇక కథలోకి వెళితే ....
       ఆఫీసులో మహిళ కొత్తగా చేరబోతోంది అంటే అటు ఆఫీసర్ నుంచి ఇటు క్రింది స్థాయి ఉద్యోగి వరకు డ్యూటీలో కొత్తగా చేరబోయే మహిళను చూడాలనే తహతహ ఎక్కువ.  వాళ్ళు అనుకున్నట్లు జగదేక సుందరి కాకుండా కళావిహీనమైన ముఖంతో మామూలు మహిళ తోలి సారిగా ఆఫీసులో అడుగు పెట్టగానే ఆమె కోసం ఎదురు చూసిన వారి ముఖాలు ఆముదం త్రాగిన ముఖాల్లా వాడిపోతాయి.  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త యాక్సిడెంట్లో మరణిస్తే, ఆమెను ఆదరించేవాళ్ళు లేక ఉద్యోగంలో చేరుతుంది సుశీల.  ఆమె ఎవ్వరూ లేని ఒంటరి అని తెలుసుకున్నమగాళ్ళు దీపం చుట్టూ తెరిగే పురుగుల్లా’ ఆమె చుట్టూ తిరగడం, అవకాశం కోసం ఎదురు చూడటం జరుగుతుంది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఆమె సీరియస్ గా తన పని తానూ చేసుకుపోవడంతో ఆమెపై కన్నుపడ్డ వారిలో కొంతమంది నిరాశతో డ్రాపవుతారు.  'ఎప్పటికైనా నా దారికిరాకపోతుందా' అని ఆలోచించే విక్రమార్కులు ఫైల్స్ అందించేటప్పుడు కావాలనే చేతులుతాకించి తృప్తి పడేవాళ్ళు సుశీల చూసిన చూపుకు ప్రక్కకు తప్పుకుంటారు.

      కొందరు చాలా విచిత్రమైన వారుంటారు. తరచి చుస్తే తప్ప వారి లోతులు అర్థం కావు.  పైనల్లో ఆమె పై కోరిక ఉన్నా పైకి మాత్రం ఉత్తముడిగా మార్కులు కొట్టేయ్యాలని శ్రీవాత్సవ హుందాగా వ్యవహరిస్తుంటాడు.  కొద్దిరోజులకు ఆమెతో స్నేహం చేసాక ఆమెకుడా స్నేహంగా చనిపోయిన తన భర్త గురించి మాట్లాడుతుంది. ఆమె తన భర్త ప్రస్తాపన తీసుకోచ్చినప్పుడల్లా అతనికి చిరాకు కలుగుతుంది.  భర్త జ్ఞాపకాలోంచి ఆమెను బైటకి తీసుకురావడానికి నానా తంటాలు పడతాడు.  చివరికి 'తన మేకవన్నె పులి' బుద్ధి బైట పడుతుంది.  ఆఫీస్ లో ఆమెను హత్తుకోబోతున్న అతన్ని నెట్టేసి, వైవాహిక బంధానకి అర్థం చెబుతుంది సుశీల.

       అగ్ని పర్వతంలా ఎగసిపడిన  శ్రీవాత్సవ కోరిక చల్లబడిపోయి పశ్చాత్తాపంతో తలదించుకుంటాడు.  'ప్రతి ఒక్కడు '' దృష్టితో చుసేవాల్లె తప్ప నన్ను ఆదరించే వాళ్ళు లేరని' సుశీల బాధ పడుతుంది.  తన తప్పు తెలుసుకున్న శ్రీవాత్సవ ఆమెకు అన్నగా, తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. తన జీవితాన్ని వక్ర రేఖలా కాకుండా సరళ రేఖలా మార్చుకుంటాడు.  

         ఒక మగ మృగాన్ని మానవత్వం ఉన్న మనిషిగా మార్చడానికి సుశీల వ్యక్తిత్వం దోహదపడుతుంది.  'అన్నా చెల్లెల అనుబంధాన్ని' కూడా అనుమానించే నేటి సమాజం కాకిలా పొడుస్తుంది అనుకున్న శ్రీవాత్సవ 'చెల్లెమ్మా వెళ్ళొస్తా' అని చెప్పడం కొసమెరుపు.  సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని రచయిత్రి పి.వి. సుజాతా రాయుడు గారి తపన కథలో కనిపిస్తుంది. 

*****


Saturday, 21 January 2012

"పరిధి దాటిన వేళ" కథ పై నా విశ్లేషణ

కథాజగత్,  కథావిశ్లేషణ పోటీకి ! 

రచయిత శ్రీ పి.వి.బి. శ్రీరామమూర్తి గారు వ్రాసిన"పరిధి దాటిన వేళ" కథపై నా విశ్లేషణ
 *******

        కథలో వర్ధనమ్మ బిపీ పేషెంట్.  బిపీ మందులు అయిపోవడంతో మందుల కోసం రోడ్డు పైకి వెళ్ళాల్సి వస్తుంది.   'రోడ్డు పైన ఎదైనా ప్రమాదం జరిగితే నలుగురు ఏమనుకుంటారు?' అని కుటుంబ సభ్యులు సూటి పోటు మాటలతో భాదిస్తారు. ఆమె ఆరోగ్యం కంటే వాళ్ళ పరువు,మర్యాదలే ముఖ్యంగా భావిస్తారు.  ఆమె తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించిందో, వాళ్ళు ఆమె పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కథలోని ఇతివృత్తం. కన్నబిడ్డలు పట్టించుకోకపోవడం, భర్త బాధపెట్టె మాటలు ఇలాంటి సంఘటనలు వర్ధనమ్మ పాత్రను తీర్చి దిద్దాయి.   కథలో మానవ మనస్తత్వంలోని వైవిధ్యాన్ని విశ్లేషించడం జరిగింది.   కథ రాయడంలో రచయిత చాలా అధ్యాయనం  చేశారనిపిస్తోంది.  వర్ధనమ్మ మానసిక సంఘర్షణ స్పష్టంగా చిత్రించబడింది.  ఆమె కాపురంలో ముప్పయ్ ఏళ్ళలో ఆమె పడిన బాధలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.  ఇలాంటి సంఘటనలు మనకు ఎక్కడో తారస పడినట్లు ఉంటుంది.

        భర్త చెడు తిరుగుళ్ళు తిరిగినా నీలో ఏదో లోపం ఉంది కాబట్టే వాడు బయట తిరుగుతున్నాడని అత్తమామలు       అనడం అన్యాయం.  కనీసం తల్లిదండ్రులతో చెప్పుకుంటే కాస్తన్నాన్యాయం జరుగుతుందనుకుంటే 'లేనిపోని వెధవ ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దని, అసలు ఇలాంటి విషయాలు మాదాగా తీసుకు రావద్దని మందలించే తల్లిదండ్రులు ఉన్నంత కాలం కోడలనేస్త్రీ’కి బాధలు తప్పవు.  విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వర్ధనమ్మ జీవితంలోఆటుపోట్లను తట్టుకోలేక ఒకదశలో ఆత్మ హత్య చేసుకుందామనుకుంటుంది.  తరువాత మనసు మార్చుకుని చనిపోతే సాధించేదేముంది, బ్రతికి సాధించాలనుకుంటుంది.  ఇన్నాళ్ళు ఆమె ఒక యంత్రంగా పనిచేసి అరిగి పోయింది.  ఒక ఆప్యాయత లేదు,అనురాగంలేదు.  అందుకే ఆమెలో ఓపిక నశించింది.  కట్టుకున్న వాడికే ప్రేమ లేనప్పుడు కన్నబిద్దలకి ఎందుకుంటుంది? భర్త మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వుండడం ఎన్నాళ్లని సహిస్తుంది.  వయసులో ఉన్నప్పుడు  భర్త అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రో ఇంటికి చేరితే కనురెప్పలు ముతపడిపోతున్న భర్త కోసం అన్నం తినకుండా ఎదురుచూడడం, అతను తిన్న తర్వాత తను తినడం,రాత్రి పడక గదిలో అతను పెట్టె హింసను భరించడం ఒక్క వర్ధనమ్మకే సాధ్యపడింది.

         ఎన్నో బాధలు అనుభవించిన వర్ధనమ్మ ఇంట్లోనుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నదంటే ఆమె మనసు ఎంతగా ఘోషించిందో అర్ధమవుతుంది .  పెద్దవాళ్ళకి కూడా మనసు ఉంటుందని, వాళ్లకి కోరికలు ఉంటాయని నేటి యువత ఆలోచించడం లేదు. అందుకే ఆమె మనోవ్యధను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్ణయానికి వచ్చింది. అదృష్టవశాత్తు టీవీ ప్రకటన ఆమెకి దారి చూపింది.   ప్రకటన వర్ధనమ్మలో నిజంగానే వెలుగు నింపింది. పనిమనిషిగా, తోటి స్త్రీకి తోడుగా ఉండటానికి నిర్ణయం తీసుకోవడంతో కథ ముగుస్తుంది.  అత్యంత సహజంగా వర్ధనమ్మ పాత్రను కనుల ముందుంచిన రచయిత శ్రీ పి.వి.బి . శ్రీరామమూర్తి గారికి అభినందనలు.



Sunday, 15 January 2012

ఈరోజు కనుమ!



  ఈరోజు కనుమ పండుగ.  ఏడాదిపాటు తమకు పాడి పంటలకు సహకరించిన పశువులకు రైతులు కృతఙ్ఞతలు తెలియజేసే పండుగ.   పండుగను గ్రామాలలో చాలా సందడిగా చేస్తారు. వ్యవసాయానికి తమకు ఎంతో చేదోడు, వాదోడుగా ఉన్న పశువులను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలను ముఖానికి, కొమ్ములకి పూసి పూలతో అలంకరిస్తారు. మేడలో గంటలు, కళ్ళకి గజ్జలు కట్టి పందెంలో పాల్గొంటారు. అలంకరించిన పశువులను వీధుల్లో ఊరేగిస్తారు. రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు వేయడం సంప్రదాయం.  అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు.