”శోధిని”

Sunday, 3 June 2018

గరుడాద్రి



దాయాదులయిన కద్రువ పుత్రులను సంహరించిన గరుత్మంతుడు,  పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడట.  స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠo చేరే వరమివ్వమని ప్రార్థించాడట.   దానికి స్వామి, తానే ఏడుకొండల మీద  వెలియనున్నానని తెలిపి... ఆ గరుత్మంతుడుని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించాడట.  అదే గరుడాద్రి.



Sunday, 27 May 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావుగారి జన్మదిన సందర్భంగా....

కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు. మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం. తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తెలుగు సినీరంగంలో అగ్రస్థానం అధిష్టించి, ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు. తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా దివ్యమైన ఆయన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు... వ్యక్తిత్వంలో మహోన్నతుడు. ఇక రాజకీయాల విషయానికొస్తే, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొన్న యోధుడు NTR. ఖండాంతరాలకు తెలుగు భాష మాధుర్యాన్ని చవి చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.

నాకు నచ్చిన పాట




Tuesday, 22 May 2018

ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం (22-05-2018)


సుఖాలకు అలవాటు పడిన మానవుడు చెట్లను నరుకుతున్నాడు.  భూమాత గుండెల్లో గునపాలు నింపుతున్నారు. దయాదాక్షిణ్యం లేకుండా జంతువులను చంపుతున్నాడు.  రానురానూ మానవుడిలో ప్రక్రుతి పట్ల నియమం, నిబద్దత తగ్గిపోతూ రాక్షసుడుగా మారిపోతున్నాడు.  తన స్వార్థంతో తన సుఖాన్నే వెతుక్కుంటున్నాడే తప్ప ప్రకృతి గురించి ఆలోచించడం లేదు.   ఫలితంగా   జీవవైవిధ్యం దెబ్బతింటున్నది.  కొండలు, కోనలు, లోయలు, సరస్సులు, చెరువులు ఇలా ప్రకృతి సంపదంతా మనిషి స్వార్థానికి బలి అవుతున్నాయి.  ప్రకృతి వనరులను మానవుడి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే తప్పులేదు.  అత్యాశకు పోవడం వల్లనే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.  దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అమూల్యమైన జీవరాశి అంతరించిపోతోంది.  ఇప్పటికైనా మానవుడు రాక్షసత్వాన్ని వీడి జీవరాశులన్నింటితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి.  జీవరాశులను పరిరక్షించుకుంటే జీవవైవిధ్యం  పెరుగుతుందని తెలుసుకోవాలి.