కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు.అదేవిధంగా బాలకార్మికులచేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నిచట్టాలు తెచ్చినా ప్రతి రంగంలోనూ బాలకార్మికులు కనబడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం గట్టి చట్టాలు తెచ్చి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి. వారిచేత చేయించుకున్న ఉత్పత్తులను నిషేదించాలి. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.
Monday 30 April 2012
Thursday 26 April 2012
'ప్రజాపథం'
రాష్ట్రంలో అట్టహాసంగా మొదలయిన
'ప్రజాపథం' జనం లేక వెలవెల పోతోంది.
ప్రజల స్పందన లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తలలుపట్టుకుంటున్నారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ కార్యక్రమం అబాసుపాలవుతోంది. స్థానిక నాయకులు ఈ కార్యక్రమం పట్ల ఎలాంటి శ్రద్ధ కనబరచకపోవడంతో ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజలల్లో ఇంత తీవ్రంగా వుందో తెలుస్తోంది. ఈ మధ్య నిత్యావసర వస్తువులు,
కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. అదేసమయంలో విద్యుత్ చార్జీలు పెంచి మరింత బారం మోపారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ,
గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం లేదు.
రోడ్లపరిస్థితి మరీ అద్వానంగా వుంది. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలేదు. అన్నీ రంగాలలోనూ ప్రభుత్వం విఫలమవడంతో తన ఉనికిని చాటుకోవడానికే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాదని ప్రజలు గ్రహించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించడం పైన దృష్టి మల్లిస్తే బాగుంటుంది.
Tuesday 24 April 2012
'మల్లీశ్వరి'
ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.
మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి' చిత్రంలోని ఈపాట ఈ కోవలోకే వస్తుంది.
మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో
కొమ్మలు గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల రేణువు సవ్వడు వినినా
నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూసితిని
గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయినిండెనో
చిత్రం: మల్లీశ్వరి
రచన: దేవులపల్లి కృష్టశాస్త్రి
గానం: భానుమతి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
Saturday 21 April 2012
భూమాతను రక్షించుకుందాం!
ఇవాళ ధరిత్రీ దినోత్సవం.
నాయకులు కాలుష్యనివారణ గురించి ప్రసంగిస్తారు. మొక్కల్ని నాటమంటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమంటారు. కానీ, వాళ్ళు మాత్రం ఇవేమీ చేయరు. నీతులు చెప్పడం ఇతరుల కోసమేనని వాళ్ళ ఉద్దేశం కాబోలు.
లక్షలాదిలా పెరిగిపోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని కలవరపెడుతున్న సమస్య. పెరుగుతున్న కాలుష్యంతో జీవన విధానం గతి తప్పుతోంది. నగరాలలో పరిశ్రమలు విడిచి పెడుతున్న పొగ జీవ రాసులకు సెగగా మారింది. దీనికితోడు పెరిగిపోతున్ననగరీకరణ మరింత కాలుష్యరహితసమాజాన్నివృద్దిచేస్తోంది. లక్షలాదిలా పెరిగి పోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని కలవరపెడుతున్నసమస్య. భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమయి పోతున్నాయి. దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం పరిసరాలకు, వాతావరణానికి, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏ నగరంలో చూసినా, ఏ యాత్రా స్థలంలో చూసినా ప్లాస్టిక్ దుర్గంధం పెచ్చరిల్లుతోంది. పెళ్ళిళ్ళలో వందలాది ప్లాస్టిక్ వస్తువులను వాడి పడేస్తున్నారు. విందు వినోదాలపేరట ప్లాస్టిక్ ప్లేట్లు కూడా వచ్చాయి. మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసి కుడా ప్లాస్టిక్ వినియోగానికి విపరీతంగా అలవాటు పడటం ధరిత్రికి పెద్ద వపత్తని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ప్లాస్టిక్ వస్తువులు పచ్చదనాన్నినాశనం చేస్తున్నాయి. నీటిని కలుషితం చేస్తున్నాయి.అంతేకాకుండా పరిసరాలను విషపూరితం చేస్తున్నాయి.
ప్లాస్టిక్ లేని రోజుల్లో మన జీవన విధానం ఎలా ఉండేది ...మనకున్న ఉపకరనాలేమిటో గుర్తుకు తెచ్చుకుని ఎవరికి వారు ప్లాస్టిక్ వాడకం పట్ల తమకు తాము నిషేధం విధించుకోవాలి. కాలుష్యకోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న భూమాతను రక్షించుకోవాలి. మనిషి అప్రమత్తతే ధరిత్రికి బాసట.
Subscribe to:
Posts (Atom)