”శోధిని”

Saturday 28 May 2016

"నట సింహం"

         
 "నందమూరి తారక రామారావు" ఈ పేరే ఒక సంచలనం... ఒక ప్రభంజనం. ఆ పేరు మంచి మానవతల మేలు కలయిక. పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు. తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రేక్షకులే ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిపొందింది. సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకం అయింది. నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించిన నట సింహం నందమూరి తారక రామారావు. తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. నమ్మిన వారిని ఆదరించడం, ఆత్మీయతను పంచడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొని, ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించిన యోధుడు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామారావుగారు సామాన్యుడు కాదు...ఒక మహాశక్తి. ఎన్నో విశిష్టలున్న మహామనిషి. సినీరంగంలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, కర్ణుడుగా, దుర్యోధనునిగా, రావణాసురుడుగా ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.
          మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....

Wednesday 25 May 2016

పచ్చని కాపురాలలో చిచ్చు !



స్మార్ట్ ఫోన్, వాట్సఫ్, పేస్ బుక్  లాంటి సాధనాలను  సరిగా వినియోగించకపోతే పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది.  వీటి ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు పండంటి కాపురాల్లో కలతలు రేపుతున్నారు.  దాంతో దంపతుల మధ్య అనుమానపు పొరలు పెరిగి, నిండు సంసారాలు పెటాకులు అవుతున్నాయి.  ముఖ్యంగా కొత్త కాపురాలలో ఇలా జరుగుతుండటం విచారకరం.  అందుకే పై సాధనాలు ఉపయోగించేటప్పుడు మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

Sunday 22 May 2016

మత్తెక్కించే మల్లెలు !


వేసవికాలం వచ్చిందంటే చాలు మల్లెపూలు  తమ సుగంధాలతో పరిసరాలను నింపేస్తాయి.  మనసును సమ్మోహన పరచి ఏదో లోకాలకు తీసుకెలతాయి.  ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా సాయంకాలం  అయ్యేసరికి మల్లెలను చూడగానే  మనసంతా ఆహ్లాదం నిండి మోహనరాగం పలికిస్తుంది. మధురానుభూతో మది సన్నాయిగీతం ఆలపిస్తుంది. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! అంతేకాదు మనసును రంజింపజేసే  మల్లెల గుబాళింపు చల్లదనానికి, కమ్మదనానికి పెట్టింది పేరు. 


Thursday 19 May 2016

కొబ్బరి బొండాంలు!


సహజసిద్ధమైన, స్వచ్చమైన లవణాలు, విటమిన్లతో నిండిన అమృతపానీయం కొబ్బరి నీళ్ళు.   వయసురీత్యా వచ్చే ఉగ్మతలను ఈ కొబ్బరి నీళ్ళు నివారించగలవు. అందుకే  కొబ్బరి చెట్టును 'కల్ప వృక్షం' అన్నారు  పెద్దలు.  కొబ్బరి నీళ్ళు దాహాన్ని తీర్చే గుణంతో పాటు శరీరాన్ని చల్లపరచే గుణం కూడా ఉండటంతో వీటి ధర కొండెక్కి కూర్చుంది. వ్యాపారస్తులు పది రూపాయలకు రైతుల దగ్గర కొని,   మనకు ఇరవయి ఐదు రూపాయలకు అమ్ముతున్నారు. ఫలితంగా అటు కష్టపడి పండించిన రైతులు,  ఇటు ఇరవయి ఐదు  రూపాయలకు కొన్న ప్రజలు నష్టపోతున్నారు.   వ్యాపారస్తులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.


Tuesday 17 May 2016

దొరికితే దొంగలు !

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్చ ఉంటుంది.  కానీ, ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం అనైతికం.  అప్రజాస్వామ్యం.  ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే, తాను గెలిచిన పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం కనీస ధర్మం.  ఒక పార్టీ నుంచి ఎన్నికై,  ఆతర్వాత  మరో పార్టీలో చేరడం ప్రజా తీర్పును కాలరాచినట్లే అవుతుంది.  ఒక పార్టీ సిద్ధాంతాలను అనుసరించి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళుతుంటే, ప్రశ్నించేవారు  కరువయ్యారు.  దీంతో అధికారం, ప్రలోభాలకు లొంగిపోయి విచ్చలవిడిగా పార్టీలు మార్చేస్తున్నారు.  ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు వేస్తారు.  వారిని కాదని ఎదో ప్రలోభాలకు లోనై,  పార్టీలు మార్చడం ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది.  ఇది ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపడం లేదు.  మనదేశంలోని   రాజకీయపార్టీలు ఇదే పద్దతిని ఎన్నుకోవడంతో దేశంలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాళ్ళు నొప్పులు పుట్టే విధంగా ఊరూరు తిరిగి,  వంద రూపాయలను పెట్టి ఓటర్లను కొనడం కన్నా,   స్టార్ హోటల్లో కూర్చొని గెలిచిన అభ్యర్థికి  లక్షలు పోసి తన వైపుకు తిప్పుకోవడం  సులభమైన పని. అందుకే అందరూ ఈ పద్దతిని ఎంచుకొంటున్నారు. అడ్డంగా దొరికిపోయినవాళ్ళు దొంగలు. చాకచక్యంతో వ్యవహరించి దొరకనివాళ్ళు దొరలు. అభ్యర్థులను తనవైపు తిప్పుకొనే విషయంలో విఫలం చెందినవాళ్ళు  నీతిమంతులు.   ప్రశ్నించే ప్రజలు మౌనంగా ఉన్నంతకాలం ఇలాంటి నీచమైన  ఫిరాయింపుల  రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి.