”శోధిని”

Monday 29 July 2013

మన తెలుగు సినిమాలు

మన తెలుగు సినిమాలు రోజు రోజుకు మరీ దారుణంగా తయారవుతున్నాయి.  కథలో దమ్ము లేక పోయినా, బూతు మాటలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు.  ఈ మధ్య వస్తున్న తెలుగు చిత్రాల నిండా బూతు డైలాగులే  వినిపిస్తున్నాయి.  టీనేజ్  కుర్రాళ్ళను థియేటర్ కి రప్పించడానికి  బూతు డైలాగులను ఎరగా వాడుతున్నారు. ఒక సినిమాలో అయితే చివరికి ముత్ర విసర్జన సన్నివేశాలకు కూడా   చెత్త  డైలాగులను వాడి తెలుగు సినీ పరిశ్రమను భ్రష్టు పట్టించారు.  ఈ చెత్త మాటలు రాసే రచయితలు  కాస్త సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తే బాగుంటుంది.  సినీ రచయితలు రాసే  డైలాగులు 'నీ యంకమ్మ' తో మొదలై, 'దొబ్బింది' అనే బూతు డైలాగ్ తో తారా స్థాయికి వెళ్ళాయి. ఈ అశ్లీల, బూతు  డైలాగులు నేటి యువతీ యువకుల నోట 'ఊతపదాలు' గా మారడం మన దౌర్భాగ్యం.    


Friday 26 July 2013

ఈ కేరళ కుట్టి మహా గట్టి!


నటనకు ప్రాధాన్యత ఇచ్చే నిత్యా మీనన్ 'గుండె జారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ కావడంతో ఆమె డిమాండ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.  ఆమెతో చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు పోటి పడుతున్నారు.  అయితే వచ్చిన అవకాశాలను ఒప్పుకోకుండా కేవలం నటనకే ప్రాధాన్యత వున్న పాత్రలనే ఎన్నుకుంటోంది.  తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ వరుస హిట్లు సాధిస్తోంది.  తొలి చిత్రం నుంచి కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తన డబ్బింగ్ ను తనే చెప్పుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయిందే'  చిత్రాలలో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ కేరళ కుట్టి మహా గట్టిది.  ఎందుకంటే ఈ మధ్యనే పైలెట్లను ఎలా మాయచేసిందో తెలియదు కాని  బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో  పైలెట్లు వుండే కాక్ పిట్ లో కూర్చుని ప్రయాణం చేసిందట.  ఆమె సరదా తీరింది కాని ఆమెను కాక్ పిట్ లోకి అనుమతించిన పైలెట్లు ఇద్దరు సస్పెన్స్ కు గురయ్యారు పాపం.  
 

Thursday 25 July 2013

ప్రియా...ప్రియా!

ఉషోదయ కిరణాలకి
మంచు తెర కరిగినట్టు...
తొలకరి జల్లుకి
పుడమి పులకించినట్టు...
హోరు గాలికి
చిగురాకు వనికినట్టు...
పున్నమి వెన్నెలకి
కలువ వికసించినట్టు...
నిన్ను చూడగానే
మరువలేని మరుపురాని
మధుర జ్ఞాపకాలు
నన్ను చుట్టిముట్టాయి
నీ మనోహర రూపం
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది
ప్రియా నిత్యం...
నీ ఉహల్లో గడిపేస్తున్నా 
నీ ఆలోచనల్లో జీవిస్తున్నా! 

Tuesday 23 July 2013

మాట్లాడటం పద్దతిగా ఉండాలి !

సృష్టిలో ఎ ఇతర జీవికి ఎవ్వని వరం భగవంతుడు మనిషికి మాట్లాడే అవకాశం కల్పించాడు.  దేవుడు నోరు ఇచ్చాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు.  ప్రతి మనిషి తోటివారికి సాయం అందిస్తూ, జీవితంలో మంచిగా ఉంటూ నిజాయితీగా, ప్రశాంతంగా జీవించాలి.  మాట్లాడటం పద్దతిగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు. అవసరమైనంత వరకే మాట్లాడితే ఆ మాటకు,  ఆ వ్యక్తికి విలువ ఉంటుంది. అందుకే తెలివైనవాళ్ళు మితంగా మాట్లాడతారు.  అనవసరంగా మాట్లాడేవాళ్ళను ఎవరూ పట్టించుకోరు. మన మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు.  ఇతరులను వేధించే విధంగా ఉండకూడదు. అందుకే మనం మాట్లాడే ప్రతి పదాన్ని బాగా ఆలోచించి ఉపయోగిస్తే బాగుంటుంది.  

Saturday 20 July 2013

శాకంబరీదేవి

 

అందాల రాక్షసి !



అందాల నటి అనుష్క ప్రస్తుతం మూడు భారీ చిత్రాలలో నటిస్తోంది.  ఈ మూడు చిత్రాలలోనూ అరివీర భంకర పోరాట పటిమను కనపరుస్తోందట. గుణశేఖర్ దర్శకత్వంలో 'రాణి రుద్రమదేవి', రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి', సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ అనువాద చిత్రం 'వర్ణ' లో నటిస్తోంది.  ఈ మూడు చిత్రాలలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ఫైట్స్  చేస్తోందట.  'రాణి రుద్రమదేవి' చిత్రంలో ఆమె కత్తి పట్టి యుద్ధం చేస్తుంటే  ఫైట్స్ మాస్టర్స్ ఆచర్యపోతున్నారట.  ఈ సినిమా కోసం పన్నెండు కేజీలు బరువు తగ్గి బాగా స్లిమ్ గా తయారయింది.  ఎలాగు యోగా టీచర్ కాబట్టి ప్రత్యేక  ఆసనాలు వేస్తూ నాజుగ్గా  అయింది.  'రాణి రుద్రమదేవి' చిత్రంలో ఓ సరికొత్త అనుష్క మనకు కనిపించబోతోంది.    ఈ మూడు సినిమాల కోసం ఎప్పుడూ లేని విధంగా కష్టపడుతోంది.  కష్టానికి ప్రతిఫలంగా పారితోషికం కుడా హీరోలతో సమానంగా రెండు కోట్లకు పెంచిందట. ఇదే నిజమైతే దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికలలో అనుష్క దే మెదటి స్థానం అవుతుంది. 
అందాల రాక్షసి 


Wednesday 17 July 2013

నీటి వ్యాపారం !


భూగర్భజలాలు కలుషితం, నీటి కొరత, కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజలు నీటిని కొనుక్కునే దుస్థితి వచ్చింది.  దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు మినరల్ వాటర్ పేరిట అక్రమ దందాను మొదలు పెట్టారు. దాంతో అక్రమ నీటి వ్యాపారం కాసులు కురిపిస్తోంది.  పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో వీరికి బాగా కలిసొచ్చింది.  చాలా చోట్ల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నీటి శుద్ధి కేంద్రాలు వెలుస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ గుర్తుతో ఇంటి  దగ్గరకొచ్చితక్కువ ధరకు నీటిని సరఫరా చేస్తున్నారు. అనుమతులు అటుంచి కనీసం నీటి శుద్దిలో నైనా ప్రమాణాలు పాటించడం లేదు. కొందరయితే మార్కెట్లో  బాగా పేరున్న  కంపెనీల లోగోలను క్యాన్ల పైన, బాటిల్ల పైన  ముద్రించి సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.  ఫ్యూర్ ఫయ్డ్ వాటర్ ని మినరల్ వాటర్ అని నమ్మించి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.  తక్కువ   పెట్టుబడితో  అధిక లాభాలు రావడంతో చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు.ప్లాంట్లకు అనుమతులు,  నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నీటి వ్యాపారం చేస్తున్నారు.  నగర శివారు గ్రామాలను ఎన్నుకొని ఈ దందాను నిర్వహించడంతో ప్రభుత్వ అధికారులు అటు వైపు కన్నెత్తి కుడా చూడటం లేదు ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోనంత కాలం ఈ అక్రమ నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంటుంది. 
  

Thursday 11 July 2013

ప్రేమ కుసుమాలు!


ప్రియా... 
ప్రేమను కురిపించి 
ఆత్మీయతను పంచి 
మమతలు నాలో నింపావు  
అనురాగం అందించి 
మనసంతా మల్లెలు పరచి  
ప్రేమ కుసుమాల 
పరిమళాలను వెదజల్లి 
నా మనసును దోచావు 
అందుకే... 
వసంతం లాంటి  
నీ రూపాన్ని 
నా హృదయ ఫలకంపై 
ముద్రించుకున్నాను. 

Wednesday 10 July 2013

మెరుపు తీగ!



"గబ్బర్ సింగ్" చిత్రంలో సంప్రదాయమైన దుస్తుల్లో ప్రేక్షకుల్ని అలరించిన శృతి హాసన్ లేటెస్ట్ గా "బలుపు" సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి తన సొగసులను ప్రదర్శించింది. శృతి తప్పుతున్న శృతి తన  అందాలను కడు ఉదారంగా ఆరబోయడం చూసి కమలహాసన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారట.చూపించడానికి కొంత అందం మిగుల్చుకుంటే క్రేజు ఉంటుందని ఈ ముద్దుగుమ్మకు తెలిసేదేప్పుడో?తనకు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని ఈ మెరుపు తీగ  తాపత్రయం. ఏది ఏమైనా ఈ నాటి హీరోయిన్లకు తెలివితేటలు కాస్త  ఎక్కువే!



Tuesday 9 July 2013

ప్రభుత్వ వాహనాలకు నియమాలు వర్తించవా?


రోడ్డు భద్రత  దృష్ట్యా ఏ వాహనంలో అయినా పరిమితికి మించి బరువును తీసుకెళ్లడం చేయకూడదు.  ఇది మంచి నిర్ణయమే. కాని, ఈ నిర్ణయాలన్నీ కేవలం ప్రైవేట్ వాహనలకే వర్తించడం, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వాహనాలకు, వ్యకులకు వర్తించక పోవడం ఆశ్చర్యకరమైన విషయం.  ఆర్టీసి బస్సుల్లో సీట్లకు మించి ప్రయానికులను రెట్టింపు సంఖ్యలో తీసుకు వెళుతున్నారు.  ప్రభుత్వ డ్రైవర్స్ ఇష్టమొచ్చినట్లు వాహనాలను నడుపుతున్నారు.  బస్సులను బస్టాపులలో అసలు ఆపరు.  ఒకవేళ బస్సు ఆగినా స్లో చేస్తారు తప్ప, బస్సును పూర్తిగా ఆపరు. ఇలా చేయడం  వల్ల  ఎంతో  మంది బస్సు వెనుక టైరు కింద పడి మరణించిన సంఘటనలున్నాయి. ఏదయినా  మొదట మనం పాటించి, ఆ తర్వాత ఎదుటి వారికి చెబితే బాగుంటుంది.    



Monday 8 July 2013

మహా నటి సావిత్రి

తెలుగులో గొప్ప చిత్రం ఏదని ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పేది 'మాయా బజార్' అని.  అలాగే తెలుగులో గొప్ప నటి ఎవరని అడిగితే 'మహా నటి సావిత్రి' అని ఎవరైనా చెబుతారు.  తెలుగు ప్రేక్షకుల మనుసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న ఎకైక నటి సావిత్రి.  ఆప్యాయతతో కూడిన ఆహ్లాదమైన చిరునవ్వు ఆమె సొంతం.  వాత్సల్యంతో నిండిన అనురాగ పూర్వకమైన కల్మషం లేని పలకరింపు ఆమె సహజ గుణం,  ఆర్థ్రత , ఆప్యాయత కురిపించే పాత్రలను ఆమె నల్లేరు మీద బండిలా పోషించి మెప్పించారు.  కేవలం ముఖ కవళికల ఆధారంగా ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేయడం ఆమె సొత్తు.  కంటి చూపుతో కోటి భావాలను పలికించే సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఆమె నటించిన చిత్రాలన్నీ అసలు సిసలైన మేలిమి రత్నాలు. 


అమ్మాయిలూ... జాగ్రత్త!

నేడు అమ్మాయిలు అన్ని రంగాలలో మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు.  ఇది శుభ పరిణామం.  కాని, ప్రేమ దగ్గరకొచ్చేసరికి  పప్పులో కాలేస్తున్నారు.  చచ్చు పుచ్చు కబుర్లు చెప్పే అబ్బాయిల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు.  మగాడి ఆలోచనా విధానం వేరని గ్రహించలేక పోతున్నారు.  ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అమాయకంగా ప్రేమంటూ   అబ్బాయిల చేతిలో బలవుతున్నారు.  ఇలా మోసపోయే అమ్మాయిలు  వున్నత వరకూ  మోసం చేసే అబ్బాయిలు పుడుతూనే ఉంటారు.అమ్మాయిలూ భ్రమలోంచి బయట పడండి... బాగా ఆలోచించి చక్కని భవిష్యత్తును నిర్మించుకోండి. మోసగాళ్ళ మాయమాటలు విని మోసపోకండి.  మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి. మీ తెలివితేటలు ఉపయోగించి మంచి తోడును ఎన్నుకోండి. 

Saturday 6 July 2013

"ప్రేమ ... పెళ్లి !"

పెళ్లికి ముందు...  
ఒకరికొకరు 
పడిచచ్చారు!
పెళ్లి అయ్యాక...  
ఒకరికొకరు 
పడక చస్తున్నారు!!



Friday 5 July 2013

జాంపండ్లు!

 
ఖరీదు తక్కువని జామకాయను  చిన్న చూపు చూడకండి.  దీనిలో అధిక పోషకాలు, ఎన్నో లాభాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు జామ కాయ సంజీవనిలా పనిచేస్తుంది.  దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మంచి మందుగా పనిచేస్తుంది.  అంతేకాదండోయ్ రక్త పోటును అదుపులో వుంచడంతో పాటు రక్తం చిక్కపడకుండా ఉండటానికి  సహాయపడుతుంది. ఎసిడిటి తగ్గిస్తుంది, మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.    ఖరీదయిన పండ్ల కంటే ఎన్నో అధిక లాభాలు ఉన్నాయి.  అందుకే జామ కాయ  తినండి ... ఆరోగ్యంగా ఉండండి. 

Wednesday 3 July 2013

ప్రకృతి ఆగ్రహిస్తే ?

















జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన జల ప్రళయం ఎవరూ  ఉహించని ఉపద్రవం. పవిత్ర క్షేత్రాలు మరు భూమిగా మారి భయానక వాతావారంలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాల్సివచ్చింది.  ఉహించని రీతిలో ప్రళయ గంగ భీకర రూపం దాల్చడంతో పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించులోవాలని తపన పడిన వారికి తీరని విషాదం మిగిలింది .కనీ వినీ ఎరుగని రీతిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.  చిన్న రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ ని కోలుకోని దెబ్బ తీసింది . పుణ్యానికి పొతే పాపం ఎదురయినట్టు తనవారిని పోగొట్టుకుని బరువైన గుండెతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భగవంతుని ప్రతిరూపాలయిన వీర జవానుల సహాయంతో బయటపడ్డారు.  ఈ పెను విపత్తుకు కారణంపర్యావరణం దెబ్బ తినడమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మన పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని నొక్కి చెప్పారు.  అభివృద్ధి పేరిట పచ్చని ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నారు.  పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల  మానవ మనుగడ పశ్నర్థకంగా మారే పరిస్తితి ఉంది. ప్రకృతి  ఆగ్రహిస్తే ఏమవుతుందో మనం కల్లారా  చూసాము.  ఇప్పటికైన మన పాలకులు మేల్కొని పర్యావరణాన్ని పరి రక్షించడానికి తగు చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను నరికివేత ఆపాలి.  నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  కొండలను నాశనం చేయకుండా కొండలుగానే ఉంచాలి.